Friday, January 3, 2014


VRO Syllabus

Thursday, January 2, 2014

క్లరికల్ కొలువుకు సక్సెస్ మార్గాలు..

బ్యాంకులు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన బ్యాంకుల సేవలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. డిపాజిట్ల సేకరణ, రుణాలు ఇవ్వడం వంటివే కాకుండా బీమా వంటి కార్యకలాపాలనూ సాగిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రాంచ్‌ల సంఖ్యను పెంచుకుంటూ కుర్రకారుకు కలల కొలువులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలా యువత భవితకు సుస్థిర బాటలు వేస్తున్న బ్యాంకింగ్ రంగంలో తొలి మెట్టు అయిన క్లరికల్ ఉద్యోగాలను చేజిక్కించుకోవాలంటే ఐబీపీఎస్ ఎగ్జామ్‌లో మెరుగైన మార్కులు సాధించాలి. ఈ నేపథ్యంలో మంచి స్కోర్ కోసం ప్రిపరేషన్ ప్లాన్..

 19 బ్యాంకుల్లో ఉన్న క్లరికల్ ఖాళీల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా భారీ సంఖ్యలోనే పోస్టులు ఉంటాయని అంచనా. వేలాది మంది బ్యాంకు ఉద్యోగుల పదవీ విరమణ, పెరుగుతున్న బ్రాంచ్‌ల సంఖ్య వల్ల ఖాళీల సంఖ్య అధికమవుతోంది. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.

 రాత పరీక్ష విధానం

 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో రెండు గంటల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.

 విభాగం     మార్కులు
 రీజనింగ్     40
  ఇంగ్లిష్ లాంగ్వేజ్     40
   న్యూమరికల్ ఎబిలిటీ     40
   జనరల్ అవేర్‌నెస్
    (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం)    40
   కంప్యూటర్ నాలెడ్జ్     40
   మొత్తం    200

 ప్రిపరేషన్ వ్యూహం

 పట్టుదలతో చదివితే సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం చదవాలి. దీనికోసం 90 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఐబీపీఎస్ క్లరికల్ పరీక్షకు ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉంది. అందువల్ల మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు కూడా శ్రమించి విజయాన్ని అందుకోవచ్చు.

 రీజనింగ్

 అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్ కోడిం గ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. దీంతో సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.

Ex: In a certain code "TERMINAL' is written as "NSFUMBOJ' and "TOWERS' is written as "XPUTSF'. How is "MATE' written in that code?
   1) FUBN    2) UFNB
   3) BNFU    4) BNDS    5) Non of these


 ఇంగ్లిష్ లాంగ్వేజ్:రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో దాదాపు 20 మార్కులు సాధించి ముందుగా కటాఫ్ నుంచి పైకి వెళ్లొచ్చు. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. మిగిలిన అంశాల్లో జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివి ఉంటాయి. వీటితో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి.

 Ex: Read below sentence to find out whether there is any grammatical mistake/ error if any, will be one part of sentence. Mark the number of the part with errors as your answer. If there is "No error', mark (5).
    If you have made a mistake(1)/while filling up the form(2)/you should be informed(3)/ the Income Tax department immediately(4). No error(5)


 న్యూమరికల్ ఎబిలిటీ:న్యూమరికల్ విభాగంలో ఎక్కువగా సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, రేషియోస్‌కు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆన్‌లైన్ పరీక్షలో సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కడ ఇచ్చారో తెలుసుకోవడానికి పైకి-కిందకు స్క్రోల్ చేసి చూడాలి. ఎందుకంటే ఒక్కోసారి దీనికి సంబంధించిన ప్రశ్నలు చివర్లో ఇస్తారు.

 Ex: The average weight of 21 boys was recorded as 64 kgs. If the weight of the teacher was added, the average increased by one kg. What was the teachers' weight?
1) 86 kgs    2) 64 kgs    3) 72 kgs    4) 98 kgs


 జనరల్ అవేర్‌నెస్:జనరల్ అవేర్‌నెస్ విభాగాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. స్టాండర్డ్ జీకే. 2. కరెంట్ అఫైర్స్. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్‌లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల్లో విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రముఖ అతిథులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి.

 ఈ పేపర్‌లోనే బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానానికి సంబంధించి దాదాపు 20 వరకు ప్రశ్నలు రావొచ్చు. దీనికోసం ప్రామాణిక బ్యాంకింగ్ అవేర్‌నెస్ పుస్తకాలను ఎంచుకోవాలి. అదే విధంగా ఓ ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో నిరంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు (ఉదా: వడ్డీ రేట్లు, బ్యాంకుల ఉన్నతాధికారుల పేర్లు, లోగోలు, బైలైన్స్..) తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌లో వాడే పదాలు, వాటి అర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ బ్యాంకుల కొత్త విధానాలు, ఆర్‌బీఐ తాజా సమాచారం తెలుసుకోవాలి.


 Ex: 1. Which of the following is Not a function of a commercial bank?

  1)    Providing project finance
  2)    Settlement of payments of behalf of the customers
   3)    Decide policy rates like CRR, SLR, & Reporates
   4)    Issuing credit/debit/ATM cards
   5)    Providing services such as locker facilities, remittances

2.   Shanti Swarup Bhatnagar Award is given for excellence in the field of ................
1) Literature    2) Music    3) Sports
4) Science and Technology
5) Social service

 కంప్యూటర్ నాలెడ్జ్:ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంటుంది. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారించాలి. తొలి ఐబీపీఎస్ పరీక్ష నుంచి చూస్తే ఈ విభాగంలో ఇస్తున్న ప్రశ్నల కఠినత్వ స్థాయి పెరుగుతోంది. అందువల్ల అభ్యర్థులు కంప్యూటర్స్-జనరేషన్స్; ఎంఎస్ వర్డ్; ఎంఎస్ ఆఫీస్; డేటాబేస్ మేనేజ్‌మెంట్, షార్ట్‌కట్ కమాండ్స్ తదితరాల గురించి తెలుసుకోవాలి.

   Ex: The permanently etched program in ROM that automatically begins executing the computer's instructions is the
   1) BIOS     2) ROM    3) CMOS
   4) RAM     5) None of these

 రిఫరెన్‌‌స బుక్స్:    వెర్బల్ రీజనింగ్- ఆర్.ఎస్.అగర్వాల్
 ఆబ్జెక్టివ్ అర్థమెటిక్- ఎస్.ఎల్ గులాటీ
 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్- దిల్హాన్ పబ్లికేషన్స్
 ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్-హరిమోహన్ ప్రసాద్

 100 వరకు మోడల్ పేపర్లు చేశా
 నేను 100 వరకు మోడల్ పేపర్లు సాధన చేశాను. షార్ట్‌కట్స్ ఎన్ని తెలిసినా తగినన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకుంటే ఫలితం ఉండదు. ప్రామాణిక ఇంగ్లిష్, తెలుగు పత్రికలతో పాటు ఇంటర్నెట్ సహాయంతో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌పై పట్టు సాధించా. దినపత్రికల్లో బిజినెస్ పేజీలను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంపై అవగాహన ఏర్పడింది. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, కంప్యూటర్ జనరేషన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌ను తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల రోజులో కొంత సమయాన్ని ఇంగ్లిష్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇంటర్వ్యూ ఎనిమిది నిమిషాలు జరిగింది. కుటుంబ నేపథ్యం, బ్యాంకింగ్‌కు సంబంధించిన కరెంట్ టాపిక్స్‌పై ప్రశ్నలు అడిగారు.

 - కృష్ణ చైతన్య, విజయా బ్యాంక్, హైదరాబాద్.
 (2012 ఐబీపీఎస్ క్లరికల్ విజేత)

 సక్సెస్‌కు ప్రాక్టీస్ కీలకం
 ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంత ఫోకస్డ్‌గా చదివామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఐబీపీఎస్ క్లరికల్, పీఓ పరీక్షల్లో విజయానికి వీలైనన్ని మోడల్ పేపర్లు సాధన చేయడం చాలా అవసరం. టైమ్ పెట్టుకొని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల తెలియని ప్రశ్నలపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుంటుంది. గ్రూప్‌గా చదవడం వల్ల సమస్యలకు తొందరగా సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడే షార్ట్‌కట్స్ తెలుస్తాయి. కరెంట్ అఫైర్స్‌పై అప్‌డేట్‌గా ఉండాలి. దినపత్రికల్లోని ఆర్థిక సంబంధమైన ఎడిటోరియల్స్‌ను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ఒంటపడుతుంది. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ బుక్స్‌ను ఉపయోగించుకోవాలి.
 - బొడ్డు శ్రీకాంత్, ఐవోబీ, నల్లజెర్ల.
 (2012 ఐబీపీఎస్ పీఓ విజేత)

 ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ వివరాలు

 అర్హత: ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ వాడుకకు సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం.
 వయో పరిమితి: 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఆగస్టు 1, 2013 నాటికి). ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది.
 ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 19, 2013.
 ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: సెప్టెంబర్ 7, 2013.
 ఆన్‌లైన్ పేమెంట్: 19.8.2013-7.9.2013.
 ఆఫ్‌లైన్ ఫీ పేమెంట్: 21.8.2013-12.9.2013.
 పరీక్షల తేదీలు: 30.11.2013, 1.12.2013, 7.12.2013, 8.12.2013, 14.12,2013, 15.12.2013.
 (వీటిలో మార్పులు, చేర్పులు జరగొచ్చు.)
 రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కంచికచర్ల, కరీంనగర్, కర్నూలు, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

 ఐబీపీఎస్ ద్వారా క్లరికల్ నియామకాలు చేపడుతున్న బ్యాంకులు

 అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్.


 వెబ్‌సైట్:www.ibps.in

బాధ్యతతో కూడిన కొలువులకు... సీఎస్‌ఆర్

ఆగస్టు మొదటి వారంలో కంపెనీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.. ఈ బిల్లు ప్రకారం కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం నిధులను కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కోసం విధిగా కేటాయించాలి.. అంతేకాకుండా సంబంధిత నిపుణుడు డెరైక్టర్‌గా సీఎస్‌ఆర్ కోసం ప్రత్యేక విభాగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.. దీన్ని అచరణ సాధ్యం చేయాలంటే ప్రత్యేక నైపుణ్యం ఉన్న మానవ వనరులు అవసరం.. ఈ నేపథ్యంలో కెరీర్ డెస్టినేషన్స్‌లో సీఎస్‌ఆర్‌కు చోటు దక్కింది. విలక్షణ కెరీర్‌గా మారనున్న.. సీఎస్‌ఆర్ అంటే ఏమిటి? ఈ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి అవసరమైన అర్హతలు తదితర అంశాలపై ఫోకస్..

 ఆర్థిక సంస్కరణల తర్వాత.. దేశాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్ర పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమకున్న వనరుల ద్వారా సమాజాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు తమ వంతు చేయూతనందించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

 అంకురార్పణ:
 కంపెనీ తన సమయూన్ని, వనరులను సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వినియోగించాలి. ఎందుకంటే సమాజం లేనిదే ఈ సంస్థలకు మనుగడ లేదు. అవి వ్యాపారం చేసి, లాభాలు గడించాలంటే.. సమాజం అనుకూల వాతావరణాన్ని కలిగి ఉండాలి. వాటాదారుని పెట్టుబడి వృద్ధి చెందాలంటే సమాజం తోడ్పాటు ఎంతో అవసరం. వాటాదారులతో పాటు సమాజంలోని మిగతా వర్గాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఖాతాదారులు, ఉద్యోగులు సంతృప్తి చెంద కుంటే.. సదరు వ్యాపార సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

 ఈ నేపథ్యాల్లోంచే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) అనే భావన వెలుగులోకి వచ్చింది. కేవలం వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేయడమే కాదు.. నాణ్యమైన ఉత్పత్తులను చౌక ధర లకు అందించడం, పర్యావరణ అనుకూల నిబంధనలను పాటించడం, తమ సంస్థల్లో కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయడం, ఉద్యోగులకు పని నిబంధనలను మెరుగుపరచడం వంటివి కూడా సామాజిక బాధ్యత కిందకే వస్తాయి. ఇందులో భాగంగానే టీసీఎస్, విప్రో వంటి సంస్థలు.. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, విద్యా రంగానికి సేవ చేస్తున్నాయి.

 ప్రత్యేక విభాగం:
 ప్రస్తుతం అన్ని రకాల కార్పొరేట్ కంపెనీలు, ఎంఎన్‌సీలలో సీఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాయి/చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయా సంస్థల్లో మిగతా విభాగాల మాదిరిగానే ఇది విడదీయరాని, తప్పనిసరి భాగమైందని చెప్పొచ్చు. ఆయా కంపెనీలు సీఎస్‌ఆర్ నిర్వహణకు సంబంధించి తేడాలు ఉంటాయి. కొన్ని కంపెనీల్లో సీఎస్‌ఆర్‌ను హెచ్‌ఆర్ విభాగం పర్యవేక్షిస్తుంటే, మరి కొన్ని కంపెనీల్లో ఎన్విరాన్‌మెంటల్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు.

 అర్హతలు ఇవి:
 సమాజం, మావన సంబంధాలను అంతర్లీనంగా అవగాహన చేసుకునే నైపుణ్యం, సంబంధిత అంశాల్లో అకడమిక్ అర్హతలు ఉన్న వారిని కంపెనీలు సీఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం నియమించుకుంటున్నాయి. ఈక్రమంలో సీఎస్‌ఆర్ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి దోహదం చేసే కోర్సులు

 ఎంబీఏ రూరల్ డెవలప్‌మెంట్
 మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ)
 పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్

 ఆయా విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలు చేసిన వారికి కూడా కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. కాకపోతే వీరి సంఖ్య చాలా స్వల్పంగానే ఉంటుందని చెప్పొచ్చు. పీజీ విద్యార్థులకు ప్రాధాన్యం లభిస్తుంది.

 కొన్ని రంగాల్లో:
 అన్ని రకాల కంపెనీల్లో సీఎస్‌ఆర్ విభాగాలున్నప్పటికీ.. కొన్ని సంస్థలు మాత్రం ఇతర సంస్థల కంటే విస్తృత స్థాయిలో సీఎస్‌ఆర్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ప్రకృతిని నేరుగా ప్రభావితం చేసే రంగాలైన మైనింగ్, మాన్యుఫాక్చరింగ్, పవర్ జనరేషన్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు ఈ కోవలోకి వస్తాయి.

 కావల్సిన స్కిల్స్:
 సీఎస్‌ఆర్ అనేది వ్యక్తిగతమైన వ్యవహారం కాదు. సమష్టిగా, జట్టుగా, సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. ఈ నేపథ్యంలో సమాజాన్ని అవగాహన చేసుకోవడం, భాగస్వామ్యాలను నిర్మించే నైపుణ్యం, స్టేక్ హోల్డర్లతో చక్కని సంబంధాలను కలిగి ఉండడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం వంటి అంశాలాధారంగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. అవి..
 బిజినెస్ స్కిల్స్ (కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయాత్మక సామర్థ్యం, వినూత్న ఆలోచన, నాయకత్వ లక్షణాలు, సంక్లిష్టతను తట్టుకునే సామర్థ్యం, సమస్యను సాధించడంలో నేర్పు)
 పీపుల్ స్కిల్స్ (భిన్న పరిసరాలకనుగుణంగా ఒదిగి పోవడం, దయ, విశాల దృక్పథం, ఇతరులను ప్రభావితం చేసే నేర్పు, సామాజిక అవగాహన, సహ భాగస్వామ్యాన్ని నిర్మించే తత్వం, జట్టుగా పని చేసే నేర్పు, ప్రశ్నించే తత్వం)
 టెక్నికల్ స్కిల్స్ (వివిధ అంశాల ప్రభావాన్ని అంచనా వేయడం, స్టేక్ హోల్డర్లతో చర్చించే నైపుణ్యం, మానవ హక్కులు, ధారణత (సస్టైనబిలిటీ) వంటి అంశాలను అవగాహన చేసుకునే నేర్పు)

 విస్తృతంగా:
 ప్రస్తుతం అన్ని కంపెనీలు/వ్యాపార సంస్థల్లో సీఎస్‌ఆర్ భాగంగా మారడంతో సంబంధిత అర్హతలు ఉన్న వారికి అవకాశాలు కూడా విస్తృత స్థాయిలో పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆసియా ఖండంలో కార్పొరేట్ వ్యవస్థల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మొదటి మూడు దేశాల్లో భారతదేశం ఒకటి కావడం కూడా సీఎస్‌ఆర్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెంచింది.

 వీరికి రూరల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ మొబిలైజేషన్, మేనేజింగ్ కలెక్టివ్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం పని చేసే వివిధ ప్రైవేట్ సంస్థల్లో, ఎన్‌జీవోలలో ఉపాధి అవకాశాలు లభించవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల ప్రాజెక్ట్‌లకు సంబంధించి భూ సేకరణలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడానికి, పునరావాస (రీసెటిల్‌మెంట్ అండ్ రిహాబలిటేషన్ -ఆర్ అండ్ ఆర్) సంబంధ అంశాలను పక్కాగా అమలు చేయడానికి కూడా సీఎస్‌ఆర్ విభాగం సేవలను కంపెనీలు వినియోగించుకుంటున్నాయి.

 సంస్థలివే:
 సీఎస్‌ఆర్‌కు సంబంధించి పబ్లిక్, ప్రైవేట్, ఎన్‌జీవో సంస్థల్లో అధిక శాతం ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), ఆంతర్జాతీయ సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ అసోసియేషన్స్, కార్పొరేట్/వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సీలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా సీఎస్‌ఆర్ కోసం సంబంధిత మానవ వనరులను నియమించుకుంటున్నాయి.

 జాబ్ ప్రొఫైల్:
 పని చేసే సంస్థ, నిర్వహించే ప్రాజెక్ట్‌లను బట్టి వివిధ హోదాలు ఉంటాయి. అవి.. కేపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్, అకడమిక్ రిసోర్సెస్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, ప్రోగ్రామ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టే ముందు దాని మూలాలను అన్వేషించి.. పరిష్కారం కనుక్కునే క్రమంలో కావల్సిన వనరులు, సాంకేతిక నైపుణ్యం, సంప్రదింపులు, తదితర అంశాలను దశల వారీగా ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి ఈ నిపుణులు కృషి చేస్తారు.

 వేతనాలు ఇలా:
 మీరు ఏ కంపెనీలో ఎటువంటి విభాగంలో పని చేయాలనుకుంటున్నారు అనే అంశం మీద వేతనాలు ఆధారపడి ఉంటాయి. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో ఉండే కో-ఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.15 నుంచి 20 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ. 30 నుంచి రూ. 50 వేలకు పైగానే సంపాదించవచ్చు.

 సోర్సెస్:
 సీఎస్‌ఆర్ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీ, ఫౌండేషన్, ట్రస్ట్ వెబ్‌సైట్ ద్వారా సంబంధిత ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని కంపెనీలు వివిధ పత్రికల్లో ప్రకటనలను ప్రచురించడం ద్వారా రిక్రూట్ చేసుకుంటాయి. జాబ్ పోర్టల్స్ ద్వారా కూడా సంబంధిత సమాచారాన్ని పొందొచ్చు.

 దీర్ఘకాలిక వ్యూహం:
 సీఎస్‌ఆర్‌కు సంబంధించిన చాలా విభాగాల్లో పని చేయడానికి స్పెషలిస్ట్ నాలెడ్జ్‌తోపాటు అనుభవం కూడా అవసరం. ఈ తరహా నేపథ్యం ఉన్న వారినే నియమించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతనిస్తాయి. కాబట్టి తదనుగుణంగా దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి. కంపెనీలు ఆశించిన స్కిల్స్, అనుభవాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం ఏదైనా సంస్థ ఆఫర్ చేసే ఇంటర్న్‌షిప్ లేదా ఏదైనా
 ఎన్‌జీవో చేపట్టే ప్రాజెక్ట్‌లో స్వచ్ఛందంగా పని చేయడం ద్వారా అనుభవాన్ని గడించే అవకాశం ఉంది. అంతేకాకుం డా సంబంధిత అంశంలో చోటు చేసుకుంటున్న పరిణమాలను నిరంతరంగా గమనిస్తూండాలి. ఇందుకోసం ఆన్‌లైన్ సోర్స్, పత్రిలకలను మాధ్యమంగా ఉపయోగించుకోవాలి.

 సీఎస్‌ఆర్ కాన్సెప్ట్ వల్ల సోషల్ వర్క్ విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి. సోషల్ వర్క్‌కు సంబంధించి మెడికల్ సైకియాట్రిక్, కమ్యూనిటీ మొబిలైజేషన్, ఉమెన్ వెల్ఫేర్, హెచ్‌ఆర్‌ఎం తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీరికి ఎన్‌జీఓలు, పారిశ్రామిక సంస్థలు, హాస్పిటల్స్, కార్పొరేట్ సంస్థలు, స్కూల్స్‌తోపాటు ప్రభుత్వ విభాగాలు సాంఘిక సంక్షేమ శాఖ, వెలుగు ప్రాజెక్ట్‌లలో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో రూ. 8 వేల నుంచి 20 వేల మధ్య వేతనాలు అందుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మా యూనివర్సిటీలో సోషల్ వర్క్ కోర్సు హాట్ కేక్. ఈ కోర్సు చేసిన వారికి 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.

 -డా॥అశోక్ కుమార్,
 అసిస్టెంట్ ప్రొఫెసర్,
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.

 ఒక సమస్యను ప్రాథమిక దశలోనే అంచనా వేయడానికి, దానికి పరిష్కారం కనుక్కునే క్రమంలో సంబంధిత ప్రజలు, ఇతర పక్షాలతో భాగస్వామ్యం నెలకొల్పడం వంటి లక్షణాలు  సోషల్ వర్క్ నిపుణులకు ఉండాలి. కార్పొరేట్ కంపెనీల్లో సీఎస్‌ఆర్ తప్పనిసరిగా మారిన నేపథ్యంలో సంబంధిత నిపుణులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయని చెప్పొచ్చు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్‌జీఓ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాల్లో సోషల్ అడిటింగ్, కమ్యూనిటీ మొబిలైజేషన్ వంటి విధులను నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.

 ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం పీజీ స్థాయిలో ఉండే సోషల్ వర్క్, సంబంధిత కోర్సులను ఎంచుకోవాలి. సమాజాన్ని ప్రొఫెషనల్ దృక్ఫథంతో అవగాహన చేసుకోవడానికి సోషల్ వర్క్ కోర్సులు ఉపయోగపడతాయి. పీజీ తర్వాత సంబంధిత అంశంలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. కేవలం ఏదో ఒక వర్గానికి పరిమితం కాకుండా అన్ని రకాల వ్యక్తులతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. సమాజ మార్పు దిశగా ఆలోచించే తత్వం, ఆశావహ దృక్ఫథం, ప్రజలతో స్నేహంగా వ్యవహరించే సామర్థ్యం ఉన్న వారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు.
 -ప్రొఫెసర్ లక్ష్మి లింగం,
 డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్.

 ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
 వెబ్‌సైట్: www.tiss.edu
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్-ఆనంద్
 వెబ్‌సైట్: www.irma.ac.in
 జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్-రాంచీ
 వెబ్‌సైట్: www.xiss.ac.in
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్-హైదరాబాద్
 వెబ్‌సైట్: www.nird.org.in
 జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-భువనేశ్వర్
 వెబ్‌సైట్: www.ximb.ac.in
 గాంధీ గ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్-తమిళనాడు
 వెబ్‌సైట్: www.ruraluniv.ac.in
 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.ignou.ac.in
 విశ్వభారతి-పశ్చిమ బెంగాల్
 వెబ్‌సైట్: www.visvabharati.ac.in
 ఢిల్లీ యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.du.ac.in
 ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు
 వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
ఎంబీఏ (మీడియా మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
 -రచన, అమలాపురం.
 మీడియూ రంగంలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి ఫ్రంట్-ఎండ్ ఆపరేషన్స్‌తోపాటు సర్క్యులేషన్, షెడ్యూలింగ్, యూడ్ సేల్స్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, మీడియా ప్లానింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ సాగుతోంది. అలాంటి ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే కోర్సే ‘మీడియూ మేనేజ్‌మెంట్’. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సాధారణంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఇంటర్నెట్, వెబ్‌సైట్‌లను నిర్వహించే సంస్థలు, పబ్లికేషన్స్ సంస్థలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉపాధి అవకాశాలుంటాయి. సాధారణంగా వీరి ప్రారంభ వేతనం నెలకు రూ.15,000-30,000 మధ్య ఉంటుంది.
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 శ్రీ పద్మావతి వుహిళా విశ్వవిద్యాలయుం- తిరుపతి. వెబ్‌సైట్: www.spmvv.ac.in/
 ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్- నోయిడా.    
 వెబ్‌సైట్: www.aaft.com
 దేవి అహల్య విశ్వవిద్యాలయ - ఇండోర్
 వెబ్‌సైట్: www.emrcdavv.edu.in
 ఇన్‌స్టిట్యూట్ ఫర్ మీడియా మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్టడీస్ - న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.imcsindia.com
 మణిపాల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ - బెంగళూరు. వెబ్‌సైట్: www.manipal.edu
 అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్-నోయిడా
 వెబ్‌సైట్: www.amity.edu
 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ- న్యూఢిల్లీ.
 వెబ్‌సైట్: www.ignou.ac.in



 మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలు?
 -హుస్సేన్, అనంతపురం.
 మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)-అహ్మదాబాద్
 కోర్సు: ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
 అర్హత: 55 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్ లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
 వివరాలకు: www.iimahd.ernet.in
 ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
 కోర్సు: పీహెచ్‌డీ ఇన్ మేనేజ్‌మెంట్ (పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్)
 అర్హత: సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీతోపాటు సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్ట్‌లో ఎంఫిల్ లేదా యూజీసీ-సీఎస్‌ఐఆర్/నెట్/గేట్/రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌లో క్వాలిఫై లేదా యూజీసీ/సీఎస్‌ఐఆర్/ప్రభుత్వ ఆర్గనైజేషన్ నుంచి రీసెర్చ్ ఫెలోషిప్ లేదా నిర్దేశించిన విధంగా యూనివర్సిటీ గుర్తించిన జర్నల్స్‌లో రీసెర్చ్ పేపర్లు ప్రచురితం అయి ఉండాలి.
 వివరాలకు: www.osmania.ac.in
 అన్నా యూనివర్సిటీ-చెన్నై
 వివరాలకు: www.annauniv.edu


  ఎంఎస్సీ (ఫిజిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలేవి?  
 -రాజేశ్, ఖమ్మం.

 ఐఐటీ-ఢిల్లీ (వెబ్‌సైట్: www.iitd.ac.in), ముంబై (వెబ్‌సైట్: www.iitb.ac.in), రూర్కీ (వెబ్‌సైట్: www.iitr.ac.in), కాన్పూర్ (వెబ్‌సైట్: www.iitk.ac.in), మద్రాస్ (వెబ్‌సైట్: www.iitm.ac.in) ఫిజిక్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు ఎంఎస్సీ ఫిజిక్స్, జాయింట్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్, ఎంఎస్సీ - పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్, ఎంఎస్సీ(ఫిజిక్స్)-ఎంటెక్ (మెటీరియల్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ) పేర్లతో పీజీ స్థాయిలో ఫిజిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐఐటీ-జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (్జ్చఝ) పరీక్షకు హాజరు కావాలి. అర్హత: మ్యాథమెటిక్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ. జామ్ పరీక్ష ఆబ్జెక్టివ్ కమ్ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఈ క్రమంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ (ఖాళీలను పూరించడం), డిస్క్రిప్టివ్ ఎస్సే ప్రశ్నలు వస్తాయి.
 జామ్-2014కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 16, 2013.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 16, 2013.
 పరీక్ష తేది: ఫిబ్రవరి 9, 2014. వెబ్‌సైట్: www.iitk.ac.in/jam


 ఎంఎస్సీ(అగ్రికల్చరల్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?    
 -శ్యామ్, హైదరాబాద్.

 మన రాష్ట్రంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 12 రకాల డిసిప్లెయిన్స్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చరల్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీఎస్సీ(సీఏబీఎం)లేదా బీఎస్సీ (అగ్రికల్చరల్). ఇవేకాకుండా ఎంఎస్సీ(అగ్రికల్చర్ బయోటెక్నాలజీ), ఎంఎస్సీ (అగ్రి విత్ వాటర్ మేనేజ్‌మెంట్), ఎంటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), మాస్టర్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులను కూడా ఈ వర్సిటీ అందిస్తుంది.
 వివరాలకు: www.angrau.ac.in

 యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర-బెంగళూరు, వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చరల్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఎంటెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విత్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్/పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెస్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్) కోర్సులను కూడా అందిస్తుంది.
 వివరాలకు: www.uasbangalore.edu.in
 సామ్ హిగ్గిన్‌బాథమ్ (అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ , ఇది డీమ్డ్ యూనివర్సిటీ) వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ (అగ్రికల్చరల్), ఎంబీఏ (అగ్రిబిజినెస్) కోర్సులను ఆఫర్ చేస్తుంది.
 వివరాలకు: www.shiats.edu.in

అగ్రికల్చరల్ కోర్సులు.. అవకాశాలెన్నో..!!

అగ్రికల్చరల్ కోర్సులు.. మెడికల్ కోర్సుల తర్వాత ఎంసెట్ ఉత్తీర్ణులకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న కోర్సులు. అగ్రికల్చరల్ కోర్సులను ప్రత్యామ్నాయ కోర్సులుగా భావించకుండా.. ప్రధానమైన కోర్సులుగా పరిగణించాలని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.పద్మరాజు సూచిస్తున్నారు. అగ్రికల్చరల్ కోర్సులతో భవిష్యత్‌లో బహుళ ప్రయోజనాలు ఉంటాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, వ్యవసాయ సంబంధ కోర్సులకు కౌన్సెలింగ్ జరుగుతున్న తరుణంలో..  అగ్రికల్చరల్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఎ.పద్మరాజుతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

 ప్రధాన కోర్సులుగానే పరిగణించాలి:
 ఎంసెట్ (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్) ఉత్తీర్ణుల్లో అధిక శాతం విద్యార్థులు ముందుగా మెడికల్ కోర్సులను లక్ష్యంగా పెట్టుకుంటారనేది నిస్సందేహం. వాటిలో అవకాశం రాకపోతే అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల వైపు దృష్టిసారిస్తారు. కానీ ఇదే సమయంలో గమనించాల్సిన అంశం.. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. మా యూనివర్సిటీ నిర్వహించిన గత కంబైన్డ్ యూజీ కౌన్సెలింగ్‌లో అన్ని కోర్సుల్లోనూ.. మూడు రీజియన్లు(ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ)లోనూ ఓపెన్ కేటగిరీలో నాన్-ఫార్మర్ కోటాలో 15 వేల లోపు ర్యాంకుతోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయి.


 రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని లాస్ట్ ర్యాంకులతో పోల్చితే అంతే ప్రాధాన్యం అగ్రికల్చరల్ కోర్సులకు కూడా లభిస్తోందనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులోని మొత్తం 30 సీట్లు భర్తీ అయ్యాయి. దీన్నిబట్టిచూస్తే.. అగ్రికల్చర్, సంబంధిత కోర్సులు కేవలం ప్రత్యామ్నాయ కోర్సులు కాదని.. వీటిని ప్రధాన కోర్సులుగానే పరిగణించాలనే విషయం స్పష్టమవుతుంది. ఈ కోర్సులకు లభిస్తున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ఇప్పటికే ఉన్న సీట్లకు అదనంగా 75 సీట్లను పెంచాం.


 బీటెక్ అగ్రికల్చర్ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా:
 ఇంటర్మీడియెట్ ఎంపీసీ అర్హతగా యూనివర్సిటీ అందిస్తున్న బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులో సీట్లను ఎంసెట్-ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తాం. ఈ కోర్సులో చేరదలచుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం.. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఇంజనీరింగ్ నైపుణ్యాలతో అనుసంధానం చేసి, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని మరింత పెంచడం. ఈ నెల పదో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా కొత్త విద్యా సంవత్సరంలో క్లాసుల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం.


 థియరీతోపాటు ప్రాక్టికల్ అప్రోచ్:
 కొత్త విద్యా సంవత్సరంలో అగ్రికల్చరల్ సంబంధిత కోర్సుల్లో చేరే విద్యార్థులు తొలిరోజు నుంచే ప్రాక్టికల్ దృక్పథంతో అడుగులు వేయాలి. కరిక్యులం కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. కేవలం క్లాస్‌రూం లెర్నింగ్, సెల్ఫ్ స్టడీకి పరిమితం అవుదాం అనే ధోరణితో రాణించలేరు. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలి. తోటి విద్యార్థులతో కలిసి కంబైన్డ్ స్టడీస్ సాగించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్త అంశాలు, అర్థం కాని విషయాలపై కంబైన్డ్ స్టడీతో స్పష్టత లభిస్తుంది.


 బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల విద్యార్థులకు క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించేందుకు యూనివర్సిటీ చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం.. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం (RAWEP). ఒక రకంగా ఇది ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం వంటిది. ఇందులో భాగంగా నాలుగేళ్ల వ్యవధిగల కోర్సులో చివరి సెమిస్టర్‌లో ఆరు నెలలపాటు విద్యార్థులు ఆయా గ్రామాల్లో వ్యవసాయదారులు, వ్యవసాయ క్షేత్రాల్లో జరిగే కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం.. అప్పటికే తాము తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అనుసంధానం చేయడం.. వ్యవసాయదారులకు తగిన సలహాలు, సూచనలు అందించడం వంటివి చేయాలి.


 ఫలితంగా విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే వాస్తవ పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. దేశంలోనే ఇలాంటి ప్రోగ్రాంను అందిస్తున్న తొలి యూనివర్సిటీ ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ. కరిక్యులం విషయంలోనూ నిరంతరం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తెస్తూ విద్యార్థులు అప్‌డేటెడ్‌గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్యాంపస్ నుంచి పీజీ చదివి గేట్ ర్యాంకుల ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందిన పూర్వ విద్యార్థులే ఇక్కడి బోధన ప్రమాణాలకు నిదర్శనం.


 వాస్తవాలను ప్రతిబింబించేలా:
 యూజీ కోర్సుల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందించే క్రమంలో వాస్తవాలను ప్రతిబింబించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. నారుమళ్లు వేయడం, నాగలి పట్టి దుక్కిదున్నడం మొదలు నిర్ణీత ఉత్పత్తి చేతికందే వరకూ.. ప్రాక్టికాలిటీ దిశగా ఆయా కాలేజీల క్యాంపస్‌లలోనే పంటలు పండించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలా ప్రతి దశలోనూ ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యమిస్తూ విద్యార్థులు పరిపూర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం.


 సీఏబీఎం సిలబస్‌లో మార్పు :
 వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు సిలబస్ మార్చాలని ఆలోచిస్తున్నాం. ఈ కోర్సులో అధిక శాతం మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఈ కోర్సంటే పూర్తిగా అగ్రికల్చర్ సంబంధిత కోర్సు అనే అభిప్రాయం తొలగించి అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్‌మెంట్ రెండు అంశాల సమ్మిళితంగా రూపొందించాలన్నదే ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో ఉపాధి దిశగా ఆయా వ్యవసాయ ఉత్పత్తుల సంస్థల్లో చేరే విద్యార్థులు సంస్థల్లో ఉత్పత్తి, నిర్వహణ విభాగాల్లో సమర్థంగా రాణించేందుకు వీలవుతుంది.


 పరిశోధనలకు ప్రాధాన్యం:
 ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీ చేపడుతున్న కార్యకలాపాల్లో ప్రధానమైంది పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వంటి కారణాలతో కాలుష్యం స్థాయి అంతకంతకూ పెరిగి.. అది వ్యవసాయంపై ప్రభావం చూపుతోంది. కాలుష్యాన్ని తట్టుకుని పంటల దిగుబడి పెంచేలా పలు పరిశోధన ప్రాజెక్టులు చేపడుతున్నాం.


 ఈ క్రమంలో పలు పంటల విషయంలో దేశంలోనే తొలిసారిగా 302 రకాలను ఆవిష్కరించాం. అంతేకాకుండా తక్కువ వ్యయంతో పంటల దిగుబడి సాధించే టెక్నాలజీల ఆవిష్కరణ కూడా చేశాం. అనేక పారిశ్రామిక సంస్థలు పరిశోధనల విషయంలో యూనివర్సిటీతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయంటేనే పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.



 పలు దేశాలతో ఎక్స్చేంజ్ ఒప్పందాలు:
 కేవలం మన దేశ వ్యవసాయ పద్ధతుల గురించే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు పలు దేశాలకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌లతో ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఒక్క అమెరికాలోనే 20 ఇన్‌స్టిట్యూట్స్‌తో ఇలాంటి ఒప్పందం ఉంది. మన దేశంలోనూ ఐఐటీ-బాంబే, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదిరాయి.


 ‘ఐటీ’తో అనుసంధానం దిశగా:
 అన్ని రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. అగ్రికల్చరల్ కోర్సులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీతో ఎంఓయూ కుదిరింది. దీంతోపాటు భవిష్యత్తులో దూర విద్యా విధానంలో వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్‌లో స్వల్పకాలిక కోర్సును ప్రారంభించాలనే యోచనలో ఉన్నాం.


 ఇది త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. అదేవిధంగా పీజీ స్థాయిలోనూ పలు కొత్త స్పెషలైజేషన్లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే తిరుపతిలో నానోటెక్నాలజీ స్పెషలైజేషన్‌ను ప్రవేశపెట్టాం. ఇదే క్రమంలో ఆధునిక పద్ధతులకు అనుగుణంగా.. పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీ, అగ్రిమార్కెటింగ్ ఇంటెలిజెన్స్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లను ప్రారంభించాం.


 అవకాశాలు పుష్కలం:
 అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల విషయంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినప్పటి నుంచే అపార అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్లేస్‌మెంట్స్ కోణంలో చూసినా.. ఉన్నత విద్య, పరిశోధనల దృష్టితో ఆలోచించినా.. అనేక ప్రయోజనాలు వీరికి సొంతమవుతున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్‌తోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా పలు ఎంఎన్‌సీలు రూ.లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలందిస్తున్నాయి. ఉన్నతవిద్య పరంగా ఎమ్మెస్సీలో చేరితే ఫెలోషిప్ లభిస్తుంది. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు.


 ఉన్నత విద్యలో పోటీ తీవ్రం:
 ప్రస్తుతం అగ్రికల్చరల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలా? లేదా ఉద్యోగంలో చేరాలా? అనేది ఆయా విద్యార్థుల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి తీసుకోవాల్సిన నిర్ణయం. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని విద్యార్థులు ఉద్యోగంలో చేరి కూడా దూర విద్య విధానం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.


 ఇక.. ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు యూజీలో చేరిన తొలి రోజు నుంనే అదే లక్ష్యంతో కృషి చేయాలి. పీజీ స్థాయిలో అగ్రికల్చర్ కోర్సుల సీట్లు, కాలేజీల సంఖ్య పరిమితం. కాబట్టి వాటికి పోటీ ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవడం సాధారణ స్థాయిలో చదివే విద్యార్థులకు సాధ్యం కాదు. కాబట్టి పీజీ లక్ష్యంగా పెట్టుకుంటే దానికి తగిన రీతిలో ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుని అడుగులు వేయాలి.


 హార్డ్‌వర్క్ ముఖ్యం:
 అగ్రికల్చరల్ కోర్సులు ఇతర కోర్సులకంటే భిన్నమైనవి. తప్పనిసరిగా బురదలో, మట్టిలో పనిచేయాల్సిన విధంగా ఈ కోర్సుల స్వరూపం ఉంటుంది. అందువల్ల అగ్రికల్చరల్ కోర్సుల విద్యార్థులకు కష్టించి పనిచేసేతత్వం ఉండాలి. కోర్సు ఆసాంతం క్షేత్ర స్థాయి బోధన సమ్మిళితంగా ఉంటుంది. ముఖ్యంగా.. 30 నుంచి 40 ఏళ్ల భవిష్యత్తుకు ఈ కోర్సులు పునాది. వీటిని దృష్టిలో ఉంచుకుని విషయ పరిజ్ఞానం పెంచుకునే దిశగా నిరంతరం శ్రమించాలి. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలతో, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో పనిచేయగల నేర్పు, ఓర్పు అవసరం. ఈ లక్షణాలు అలవర్చుకుంటే అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది.

కొత్త కొలువులు @ సైబర్ లా

నా బ్యాంకు ఖాతాలోంచి రూ. 30 వేలు
 మాయమయ్యాయి!
 - ఓ కార్పొరేట్ సంస్థ ఉద్యోగి ఆవేదన

 ఎవరో నా పేరుతో ‘ఫేస్‌బుక్’లో నకిలీ అకౌంట్ తెరిచారు!
 - ఓ బాలీవుడ్ హీరోయిన్ ఫిర్యాదు

 నా ఈ-మెయిల్‌కు అసభ్యకర ఫొటోలు పంపిస్తున్న వారిని పట్టుకోండి!
 - ఓ కాలేజీ యువతి విజ్ఞప్తి

 ‘సైబర్ లాస్’ కెరీర్‌లో రాణించాలంటే అవసరమైన స్కిల్స్

 సమస్యను విశ్లేషించి, పరిష్కార మార్గాలను సూచించగలగడం.
 సైబర్ స్పేస్‌కు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ చట్టాలపై అవగాహన.

 ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఒంటబట్టించుకోవడం.

 ఇప్పుడు ఇలాంటి కేసులెన్నో పోలీసుల ముందుకు వస్తున్నాయి. రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటం, నెట్ ఆధారిత సేవలు విస్తరిస్తుండటంతో సైబర్ నేరాలు, వివాదాలు అధికమవుతున్నాయి. దీంతో సైబర్ న్యాయ నిపుణుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సైబర్ లా’ తో కెరీర్ ఆప్షన్స్‌పై స్పెషల్ ఫోకస్..

 ఇంటర్నెట్‌కు సంబంధించిన వర్చువల్ ప్రపంచమే ‘సైబర్ స్పేస్’. దీనికి సంబంధించిన చట్టాలే సైబర్ లాస్.. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలు బాగా విస్తరిస్తున్నాయి. ఈ-బిజినెస్, ఈ-గవర్నెన్స్, ఈ-ప్రొక్యూర్‌మెంట్.. ఇలా వివిధ రకాల కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలా వివిధ రూపాల్లో ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దుర్వినియోగపరిచే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. క్రెడిట్ కార్డు, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ తదితరాలకు సంబంధించిన మోసాలతో పాటు హ్యాకింగ్, బ్లాక్ మెయిలింగ్, పోర్నోగ్రఫీ వంటి అనైతిక కార్యకలాపాలు బయటపడుతున్నాయి.

 భారత్ పరిస్థితి:
 ఒక్క భారత్‌లోని పరిస్థితిని గమనిస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2011లో ఐటీ చట్టం కింద 1,791 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, 2012లో ఈ సంఖ్య 2,876కు చేరింది. ఇలా దేశంలో ఏటికేడు పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సాంకేతిక మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలని, సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, నేరాల గుర్తింపు, నమోదు, పరిశోధన, ప్రాసిక్యూషన్‌లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించినట్లు ఇటీవల కేంద్రం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ న్యాయ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. సైబర్ లాస్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలుంటున్నాయి.

 సైబర్ లాస్-కోర్సులు:
 దేశంలో సైబర్ లాస్‌కు సంబంధించి డిప్లొమా, పీజీ డిప్లొమా వంటి కోర్సులతో పాటు పీజీ స్థాయి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ‘పీజీ డిప్లొమా ఇన్ సైబర్ లాస్’ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లా డిపార్ట్‌మెంట్ కూడా సైబర్ లాస్‌లో పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. 60 సీట్లు నాన్ స్పాన్సర్డ్ అభ్యర్థులకు, 20 సీట్లు స్పాన్సర్డ్ అభ్యర్థులకు కేటాయించారు.

 పుణేలోని ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లాస్.. డిప్లొమా ఇన్ సైబర్ లా, అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్ ఇన్ సైబర్ లాస్, పీజీ ప్రోగ్రామ్ ఇన్ సైబర్ లాస్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
 రెగ్యులర్‌తో పాటు దూరవిద్య ద్వారా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు ఆన్‌లైన్ విధానంలో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

 కోర్సులో చేరాలంటే:
 డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేషన్‌ను అర్హతలుగా నిర్దేశిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరాలంటే ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉండాలి. కొన్ని విద్యా సంస్థలు నేరుగా ప్రవేశాలు కల్పిస్తుండగా, మరికొన్ని ఎంట్రెన్స్ పరీక్షలో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

 రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో కరెంటు అఫైర్స్; కామర్స్, సైన్స్, ఆర్ట్స్; లా అవేర్‌నెస్‌లపై ప్రశ్నలు ఉంటాయి.

 కోర్సులో బోధించే అంశాలు:
 సైబర్ న్యాయ నిపుణులుగా రాణించాలంటే లాతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలపైనా పరిజ్ఞానం సంపాదించడం అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరిక్యులంను రూపొందిస్తున్నారు. లా, టెక్నాలజీలకు సంబంధించిన అంశాలు; లా ఆఫ్ డిజిటల్ కాంట్రాక్ట్స్; సైబర్ స్పేస్‌లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ; నెటిజన్ల హక్కులు; ఈ-గవర్నెన్స్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం; సైబర్ చట్టాలు (జాతీయ, అంతర్జాతీయ); కాపీరైట్, పేటెంట్‌లు, ట్రేడ్‌మార్క్స్, డేటా బేస్ వంటి అంశాలను బోధిస్తారు.

 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.. సైబర్ లా పీజీ డిప్లొమా కోర్సు కరిక్యులంలో కొన్ని అంశాలు...
 డిఫైనింగ్ సైబర్ స్పేస్, జ్యురిస్‌డిక్షన్ ఇన్ సైబర్ స్పేస్.
 అండర్‌స్టాండింగ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్.
 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్.
 సైబర్ కాంట్రాక్ట్స్ అండ్ ఇండియన్ లీగల్ పొజిషన్.
 అండర్‌స్టాండింగ్ కాపీరైట్ ఇన్ ఐటీ.
 లీగల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్‌వేర్ కాపీరైట్.
 పేటెంట్స్, ట్రేడ్‌మార్క్స్, డేటాబేసెస్.
 ఈ-కామర్స్, ఈ-బ్యాంకింగ్, సైబర్ క్రైమ్స్, ఇంటర్నెట్ గవర్నెన్స్.

 అదనపు అర్హతతో ఉత్తమ కెరీర్:
 ఇప్పటికే న్యాయవాద వృత్తిలో ఉన్నవారు సైబర్ లాస్ కోర్సుల్లో చేరి ఉన్నత కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు. ఇదే విధంగా సైబర్ లాస్ కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకునేందుకు అవకాశమున్న వారు మరికొందరు కూడా ఉన్నారు.
 వారు..
 ఐటీ స్టూడెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్.
 పోలీస్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.
 ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్.
 నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్స్.
 మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్.
 చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్.
 కామర్స్ స్టూడెంట్స్.

 కెరీర్ అవకాశాలు:
 సైబర్ లాస్ కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసిన వారికి వివిధ కెరీర్ అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ సంస్థలు ఉద్యోగాలను అందుబాటులో ఉంచుతున్నాయి.
 అవి:
 శాంతిభద్రతలు, నిఘా విభాగాలు.
 ఐటీ సంస్థలు, కార్పొరేట్ హౌస్‌లు.
 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.
 న్యాయ సేవల సంస్థలు.
 టెక్నాలజీ సంబంధిత సంస్థలు.
 లా స్కూల్స్, విశ్వవిద్యాలయాలు.

 ఏయే ఉద్యోగాలు ఉంటాయి:
 సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారు వివిధ అవకాశాలను చేజిక్కించుకొని కెరీర్‌లో స్థిరపడొచ్చు. లా డిగ్రీ కూడా ఉంటే ఉన్నత కొలువులు పలకరిస్తాయి. అవి:
 సైబర్ కన్సల్టెంట్.
 ఇంటర్నెట్ రీసెర్చ్ అసిస్టెంట్, లా అడ్వైజర్.
 లీగల్ ఎగ్జిక్యూటివ్, లా ఆఫీసర్, లీగల్ సెక్రటరీ.
 సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్, సైబర్ రీసెర్చ్ మేనేజర్స్.
 ట్రైనింగ్ ఎక్స్‌పర్ట్స్, అడ్వైజర్స్ టు వెబ్ డెవలపర్స్.
 సెక్యూరిటీ ఆడిటర్స్, రీసెర్చ్ అసిస్టెంట్స్.
 లా డిగ్రీతోపాటు సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

 వేతనాలు:
 వేతనాలనేవి అభ్యర్థి విద్యార్హతలు, వ్యక్తిగత సామర్థ్యం, పనిచేసే సంస్థ తదితరాలపై ఆధారపడి ఉంటాయి.
 సైబర్ లా కోర్సులు పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరిన వారి ప్రారంభ వేతనం నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది.
 ఓ కార్పొరేట్ లేదా లా సంస్థలో కన్సల్టెంట్‌గా చేరిన వారికి రూ. 22 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆఫర్ చేస్తున్నారు.
 పని అనుభవం, వ్యక్తిగత సామర్థ్యంతో ఉన్నత స్థానాలను చేరుకొని రూ. 40 వేల వరకు అందుకోవచ్చు.
 మంచి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి.

 ‘సైబర్ లాస్’ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది
 ఓ జాతి, సమాజం అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ-కామర్స్, ఈ-గవర్నెన్స్ వంటి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తూ అక్రమాలకు పాల్పడుతున్న కేసులు, వివాదాలు అధికమవుతున్నాయి. అందుకే సైబర్ న్యాయ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.

 దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం దేశంలోని వివిధ విద్యా సంస్థలు సైబర్ లాస్‌కు సంబంధించిన కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని లా డిపార్ట్‌మెంట్ ఏడాది కాల వ్యవధితో సైబర్ లాస్‌లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి, సీట్లను భర్తీ చేస్తున్నాం. కోర్సులో భాగంగా లాస్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, ఎలక్ట్రానిక్ ఒప్పందాలు, ఈ-గవర్నెన్స్, ఈ-కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం; సైబర్ చట్టాలు (జాతీయ, అంతర్జాతీయ); కాపీరైట్, పేటెంట్‌లు, ట్రేడ్‌మార్క్స్, డేటా బేస్ వంటి అంశాలను బోధిస్తారు.

 సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్, ఐటీ, పోలీస్ డిపార్ట్‌మెంట్స్, కార్పొరేట్ హౌస్‌లు వంటి వాటిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పుడు కంపెనీలు టెక్నాలజీ ఆధారంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి. సైబర్ న్యాయ నిపుణులు నెట్ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ పేటెంట్స్, కాపీరైట్స్ తదితరాలకు సంబంధించిన కేసులను పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, న్యాయ సంబంధ విషయాలపై పట్టుండి, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సమస్య విశ్లేషణ శక్తి ఉన్నవారు ఈ రంగంలో రాణించగలరు.
 - డాక్టర్ బి. విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్,
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా (ఓయూ).

 సైబర్ లాస్ కోర్సులు అందిస్తున్న సంస్థలు
 ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లా  
 వెబ్‌సైట్: www.asianlaws.org
 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా
 వెబ్‌సైట్: www.nalsarpro.org
 ఉస్మానియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.osmania.ac.in/lawcollege
 ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్
 వెబ్‌సైట్: www.ili.ac.in
 నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: ded.nls.ac.in
 సింబయోసిస్ సొసైటీస్ లా కాలేజ్
 వెబ్‌సైట్: www.symlaw.ac.in
 సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)
 వెబ్‌సైట్: www.uohyd.ac.in

స్పెషల్ ఎడ్యుకేషన్.. ఉపాధికి లేదు ఢోకా!

ఏదో చెప్పాలనుంటుంది.. ఏమీ చెప్పలేని నిస్సహాయత. ఆకలేస్తుంది.. కానీ నోరు తెరచి అడగలేరు. పుట్టుకతోనే విధి చిన్నచూపుతో నిస్సహాయంగా కళ్లెదుట కన్నబిడ్డల వేదనచూసి ఎలా అర్థంచేసుకోవాలో తెలియక మౌనవేదన అనుభవించే తల్లిదండ్రులు మన చుట్టూ ఎందరో కనిపిస్తుంటారు. చిన్నారుల అంతరంగాన్ని అర్థం చేసుకొని.. మనందరిలాగే సాధారణ పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రీ మెచ్యూర్డ్ బేబీస్, జెనెటికల్ డిజార్డర్స్ వంటి రకరకాల కారణాలతో ప్రత్యేక అవసరాల పిల్లల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. మన రాష్ర్టంలో మొత్తం 25 కాలేజీలు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో సుమారు 2,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 నిపుణుల కొరత:
 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం- ప్రపంచ జనాభాలో 11 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. వీరిలో 3.6 శాతం మంది సరిగా మాట్లాడలేని, వినికిడి లోపంతో ఉన్నారు. ఇంతమంది అవసరాలకు తగినట్లుగా స్పెషల్ ఎడ్యుకేషన్ నిపుణులు లేకపోవటం పెనుశాపంగా మారింది. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్‌సీఐ) అంచనా ప్రకారం- ఈ రంగంలో సేవలందించేందుకు మన దేశంలో స్పీచ్, ఆడియాలజీ విభాగంలో 4,500 మంది, స్పెషల్ టీచర్స్ 10,000 మంది అవసరం. లోపాలతో జన్మించిన పిల్లలకు సకాలంలో అవసరమైన శిక్షణను అందించకపోవడం వల్ల వారు శాశ్వత వైకల్యంతో జీవితాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది.

 పెరుగుతున్న ఆదరణ:
 మానసికంగా, శారీరకంగా ఎదగని పిల్లలను తీర్చిదిద్దేందుకు శాస్త్రీయంగా శిక్షణ పొందినవారు చాలా అవసరం. దాంతో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. చెవిటి, మూగ, మనోవైకల్యం తదితర సమస్యలకు అనుగుణంగా డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు ఆదరణ లభిస్తోంది. ఆయా కోర్సులు పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లోనూ ఉపాధి, ఉద్యోగావకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.


 డిప్లొమా, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ కొలువులకూ అర్హత ఉండటంతో చాలామంది ఇటువైపు దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా.. స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకూ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపచేయడంతో మరింత ఎక్కువ మంది ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.


 కోర్సులు:
 రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్‌సీఐ) ఆధ్వర్యంలో.. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహిస్తున్నారు. విజువల్ ఇంపెయిర్‌మెంట్, హియరింగ్ ఇంపెయిర్‌మెంట్, మెంటల్ రిటార్డేషన్, లెర్నింగ్ డిజెబిలిటీ, రిహాబిలిటేషన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ, ప్రోస్థటిక్స్/ ఆర్థోటిక్స్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, రిహాబిలిటేషన్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, స్పీచ్ అండ్ హియరింగ్, లోకోమోటర్ అండ్ సెరిబరెల్‌పాల్‌సే, ఆటిజమ్ స్పెక్ట్రమ్ అండ్ డిజార్డర్, రిహాబిలిటేషన్ థెరపీ, రిహాబిలిటేషన్ సోషల్ వర్క్/అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో... దేశవ్యాప్తంగా సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులు,డిగ్రీ కోర్సులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో పలు స్పెషల్ కోర్సులను ఆర్‌సీఐ పరిధిలోని వివిధ కళాశాలలు అందిస్తున్నాయి.

 సర్టిఫికెట్ కోర్సులు:
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: పదో తరగతి/ఐటీఐ/10+2

 డిప్లొమా కోర్సులు:
 డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), డిప్లొమా ఫర్ ఇన్ఫర్మేషన్ అసిస్టివ్ టెక్నాలజీస్ ఫర్ ఇన్‌స్ట్రక్టర్స్ ఆఫ్ డెఫ్‌బ్లైండ్ అండ్ డెఫ్ విత్ లో విజన్, డిప్లొమా ఇన్ టీచింగ్ యంగ్(డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్), డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్(లెవెల్ ఏ,బీ,సీ), డిప్లామా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపేర్ అండ్ హియర్ మౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ బేసిక్ డెవలప్‌మెంట్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్, బ్లైండ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(సెరిబ్రల్ పాల్‌సే), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్).
 డిప్లొమా కోర్సుల కాలవ్యవధి: ఏడాది
 అర్హత: 10+2/ఇంటర్మీడియెట్

 ప్రవేశం: కొన్ని కోర్సులకు అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, డీఈడీ వంటి మరికొన్ని కోర్సులకు రాత పరీక్ష ఆధారంగా సంబంధిత యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నిబంధనల మేరకు ప్రవేశం కల్పిస్తారు.

 బ్యాచిలర్ కోర్సులు:
 బ్యాచిలర్ ఆఫ్ మొబిలిటీ సైన్స్(బీఎంఎస్సీ), బీఏ, బీఈడీ(విజువల్ ఇంపెయిర్‌మెంట్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్‌మెంట్), బీఎస్సీ (స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (మెంటల్ రిటార్డేషన్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (లెర్నింగ్ డిజాబిలిటీస్), బ్యాచిలర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (లోకోమోటర్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (మల్టిపుల్ డిజాబిలిటీస్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్), బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్.
 బీఈడీ కోర్సుల కాలవ్యవధి: ఏడాది
 అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
 ప్రవేశం: అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, లేదా ఆయా యూనివర్సిటీ నిబంధనల మేరకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

 పీజీ కోర్సులు:
 ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్‌మెంట్), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), ఎంఎస్సీ డిజాబిలిటీ స్టడీస్(ఎర్లీ ఇంటర్వెన్సన్), మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, మాస్టర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్, ఎంఎస్సీ సైకో సోషల్ రిహాబిలిటేషన్, మాస్టర్ ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్.
 ఎంఈడీ కోర్సుల కాలవ్యవధి: ఏడాది.
 అర్హత: బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.
 ప్రవేశం: అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, లేదా ఆయా యూనివర్సిటీ నిబంధనల మేరకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

 పీజీ డిప్లొమా కోర్సులు:
 పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్స్‌న్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ ఇంజనీరింగ్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్(మల్టిపుల్ డిజాబిలిటీస్: ఫిజికల్ అండ్ న్యూరోలాజికల్), పీజీ డిప్లొమా ఇన్ డెవలప్‌మెంటల్ థెరపీ(మల్టిపుల్ డిజాబిలిటీస్: ఫిజికల్ అండ్ న్యూరోలాజికల్), పీజీ డిప్లొమా ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అండ్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సులకు వేటికవే ప్రత్యేకంగా ఆయా యూనివర్సిటీల నిబంధనల మేరకు అర్హతలు నిర్ణయించి, రాత పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

 దూరవిద్య కోర్సులు:
 బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హెచ్‌ఐ/వీఐ/ఎంఆర్/ఎల్‌ఐ అండ్ సీపీ), పీజీ ప్రొఫెషనల్ డిప్లొమా(ఇన్‌సర్వీసు టీచర్స్ కోసం, ఏడాది), పీజీ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ డిజాబిలిటీ ఫర్ డాక్టర్స్, డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, ఫౌండేషన్ కోర్సు ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ (3 నెలలు), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ.. తదితర కోర్సులను ఇగ్నో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి.

 అవకాశాలు అనేకం:
 బాధితులు పెరుగుతున్నకొద్దీ ఆయా విభాగాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దేశ, విదేశాల్లో మూగ, చెవుడు, మానసిక వైకల్యం తదితర సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నిపుణుల సేవలు తప్పనిసరి. అందుకే కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు కార్పొరేటు, ప్రభుత్వ రంగాల్లో కొలువులు స్వాగతం పలుకుతున్నాయి.

 ఇటీవల స్పెషల్ బీఈడీ చేసిన వారికి డీఎస్సీలో అవకాశం కల్పించడంతో ఈ కోర్సుకు మరింత డిమాండ్ పెరిగింది. స్పీచ్, ఆడియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి కార్పొరేటు ఆసుపత్రుల్లో అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్జీవోలు, ఆసుపత్రులు, ఆసుపత్రి నిర్వహణలో ఉపాధి లభించడంతోపాటు ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవ చేస్తున్నామనే సంతృప్తి కూడా వీరికి లభిస్తుంది. కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో ఉండటంతోపాటు విదేశాల్లోనూ కొలువు సంపాదించే అవకాశం ఉంది.

 మన రాష్ట్రంలోనే స్పీచ్, ఆడియాలజీ విభాగంలో నెలకు రూ.16 వేల నుంచి వేతనాలు అందిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి బోధన నిపుణులుగా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిపుణులుగా రూ.20 వేల నుంచి ప్రారంభ వేతనం లభిస్తోంది. ఇక విదేశాల్లో విద్యార్హతల ఆధారంగా జీతాలు లభిస్తున్నాయి.

 ఆర్‌సీఐ పోర్టల్:
 దేశవ్యాప్తంగా రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్న విద్యాసంస్థలు, కళాశాలలు, ఫీజులు, కోర్సులకు సంబంధించిన సిలబస్ తదితర వివరాలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) వెబ్‌సైట్  http:// rehabcouncil.nic.in ద్వారా తెలుసుకోవచ్చు.

 అవకాశాలు పుష్కలం
 మానసికంగా, శారీరకంగా ఎదగని పిల్లలు, వ్యక్తులను తీర్చిదిద్దడంలో నిపుణులు చూపే ప్రేమ అనిర్వచనీయం. మనసులోకి తొంగిచూసి, అంతరంగాన్ని అర్థంచేసుకుని అలాంటి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చడంలో నిపుణుల సేవలు కీలకం. ఏటేటా వైకల్యంతో జన్మిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ, అవసరాలకు అనుగుణంగా నిపుణులు లేరు. అందుకే కోర్సు పూర్తిచేసిన వారికి వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశ, విదేశాల్లో కూడా పుష్కలమైన అవకాశాలున్నాయి.

 ప్రారంభ వేతనం కూడా బాగుండటంతో యువత ఇప్పుడిప్పుడే ఈ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. సొంత ప్రాక్టీసు, ఎన్జీవోలు, ఆసుపత్రుల్లో పనిచేసే వీలుంది. సర్వశిక్షాభియాన్ ద్వారా ప్రభుత్వం కూడా వినికిడి, మూగ, మనోవైకల్యంతో బాధపడే చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది. కాస్త ఓర్పు, నేర్పు ఉంటే ఇలాంటి కోర్సులతో జీవితంలో స్థిరపడొచ్చు.
 - డాక్టర్ పి. హనుమంత రావు, చైర్మన్, స్వీకార్-ఉపకార్.

 డిమాండ్ పెరుగుతోంది
 స్పెషల్ కోర్సులకు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ రంగాలతోపాటు ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలు మెరుగవుతున్నాయి. సేవ చేస్తున్నామనే సంతృప్తితోపాటు ఉపాధి లభిస్తుండటం కూడా ఈ కోర్సుల పట్ల ఆసక్తికి కారణం. ముఖ్యంగా స్పీచ్, ఆడియాలజీలో నిపుణుల కొరత ఉంది. వినికిడి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఆంధ్ర మహిళా సభలో డీఎడ్ (హియర్ ఇంపైర్డ్, మెంటల్ రిటార్డ్) రెండేళ్ల కోర్సు. ఒక్కోదానిలో 25 సీట్లున్నాయి. గతంలో సీట్లు భర్తీ అయ్యేవి కాదు. నాలుగైదేళ్ల నుంచి సీట్లు మిగలట్లేదు.
 -పి. కృష్ణవేణి, ప్రిన్సిపల్,
 కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, ఆంధ్రమహిళాసభ.

 స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తోన్న  విద్యాసంస్థలు
 ఠాకూర్ హరిప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్,
 వివేకానందనగర్, దిల్‌సుఖ్‌నగర్.
 స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, సికింద్రాబాద్, వైఎస్సార్ కడప జిల్లా, గుంటూరు, తాండూరు.
 హెలెన్‌కిల్లర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిజాబుల్డ్ చిల్డ్రన్, సికింద్రాబాద్.
 డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్టణం.
 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.
 కాలేజీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్రమహిళాసభ, ఓయూ క్యాంపస్.
 నవజీవన్ రెసిడెన్షియల్ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్, నంద్యాల, కర్నూలు జిల్లా.
 దుర్గాబాయి దేశ్‌ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, విద్యానగర్, హైదరాబాద్.
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్.