మరింతమంది విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నిబంధనలను సరళతరం చేయనుంది. మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులనూ అకడెమిక్ అసోసియేట్స్(ఏఏ), రీసెర్చ్ అసోసియేట్స్(ఆర్ఏ) గా నియమించుకోనుంది. విదేశాల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్లను చేయాలనుకునేవాళ్లను సాధారణంగా ఐఎస్బీ ఏఏ, ఆర్ఏలుగా నియమించుకుంటోంది.
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను దిగ్గజ కాలేజీల నుంచి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్లలో బ్యాచిలర్ డిగ్రీ చేసినవారికీ విస్తరించే ప్రణాళికల్లో ఉన్నామని ఐఎస్బీ సీనియర్ అసోసియేట్ డీన్ (ఫ్యాకల్టీ, రీసెర్చ్) సంజయ్ కల్లాపూర్ చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసిన పోస్ట్గ్రాడ్యుయేట్స్కు మాత్రమే అమలవుతోంది.
ఐఐటీ, ఐఐఎం తదితర పేరొందిన సంస్థల నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అసోసియేట్స్ను ఐఎస్బీ నియమించుకుంటోంది. వీళ్లు ఫ్యాకల్టీకి సహకరిస్తారు. కాగా, కొత్త విధానంలో బ్యాచిలర్ డిగ్రీ చేసేవాళ్లు కూడా మూడో సంవత్సరంలో ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుందని కల్లాపూర్ చెప్పారు.
ఎడ్సెట్కు 1.45 లక్షల దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశానికి 1.45 లక్షల దరఖాస్తులు అందినట్లు ఎడ్సెట్-2012 కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు తెలిపారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 28తో ముగిసిందని చెప్పారు. సోషల్ విభాగంలో అత్యధికంగా 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 650 బీఈడీ కళాశాలల్లో 65,000 సీట్లను జూన్ 8న నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.
మే 22వ తేదీ నుంచి హాల్టిక్కెట్ల జారీ ప్రారంభమవుతుంది. విద్యార్థుల సెల్ఫోన్కు ఈ సమాచారం అందుతుంది. వెబ్సైట్ నుంచి కూడా హాల్టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
సివిల్స్కు ఏపీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఏపీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ ప్రకటన విడుదల చేశారు. పుస్తకాలు, వసతి, భోజనం, ఇతర సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు మే 25లోపు సమర్పించాలన్నారు.
గ్రూప్-1పై పిటిషన్ల కొట్టివేత
గ్రూప్-1 మెయిన్స్ ప్రశ్నపత్రంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ.. దాఖలైన పిటిషన్లను రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) కొట్టివేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ యతిరాజులు, సభ్యులు ఏకే.గోయల్ల నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
గ్రూప్-1 మెయిన్స్ తెలుగు ప్రశ్నపత్రంలో దొర్లిన అనువాద దోషాలతో 350 మార్కులను కోల్పోయామని పేర్కొంటూ వందలాదిమంది అభ్యర్థులు ట్రిబ్యునల్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రిబ్యునల్లో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. అనువాదాల్లో ఎటువంటి తప్పులు దొర్లలేదని, జవాబు పత్రాల మూల్యాంకనం నిబంధనల మేరకే జరిగిందని ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది తె లిపారు.
ఈ నేపథ్యంలో... ఏపీపీఎస్సీ వాదనతో ఏకీభవించిన ట్రిబ్యునల్ అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని ఏపీపీఎస్సీ ఆయా శాఖలకు లేఖలు రాసినట్లు సమాచారం.
రాష్ట్రానికి 7 ఏఎన్ఎం, 7 జీఎన్ఎం స్కూళ్లు
రాష్ట్రానికి 11వ ప్రణాళిక నిధుల తో 7 ఏఎన్ఎం(ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ), 7 జీఎన్ఎం(జనరల్ నర్స్ మిడ్వైఫరీ) స్కూళ్లు మంజూరయ్యాయి. దేశవ్యాప్తంగా 269 జిల్లాల్లో 132 ఏఎన్ఎం, 137 జీఎన్ఎం కాలేజీలను మంజూరు చేయగా.. అందులో మన రాష్ట్రానికి 14 దక్కాయి. ఈ కాలేజీలను తిరుపతి, కాకినాడ, ఏలూరు, నరసాపురం, ఒంగోలు, విజయవాడ, కరీంనగర్లలో ఏర్పాటు చేస్తారు. ఒక్కో ఏఎన్ఎం కాలేజీకి రూ. 5 కోట్లు, జీఎన్ఎం కాలేజీకి రూ. 10 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి.
ఎండీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం
పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో తొలి విడత కౌన్సెలింగ్ ఏప్రిల్ 29న ప్రారంభమైంది. మొత్తం 203 సీట్లున్నాయి. తొలిరోజు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్లో 135 మంది హాజరవగా, 102 సీట్లు భర్తీ అయ్యాయి. ఫస్ట్ ర్యాంకర్ యలమంచిలి ప్రియాంక హైదరాబాద్ డెంటల్ కళాశాలలోని కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ సీటు తీసుకున్నారు. ఆమెకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.వేణుగోపాలరావు, కౌన్సెలింగ్ కన్వీనర్ డాక్టర్ టి.మురళీమోహన్లు ప్రవేశ అనుమతి పత్రాలు అందజేశారు.
ముస్లిం ఎస్సై అభ్యర్థుల పరుగు తేదీలో మార్పు
ఎస్సై(సివిల్), ఎస్పీఎఫ్, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లిం అభ్యర్థులకు రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని వారికి నిర్వహించే ఐదు కిలోమీటర్ల పరుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. హైదరాబాద్ ఆరో జోన్కు సంబంధించిన అభ్యర్థులకు తొలుత జూలై 20 నుంచి ఆగస్టు 21 వరకు పరుగు పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. మారిన తేదీల ప్రకారం- ముస్లిం అభ్యర్థులకు పరుగు పరీక్షను సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు నిర్వహిస్తారు.
మే నెలలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్
పోస్ట్ పరీక్ష తేదీ
ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ మే 6
గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లెక్చరర్స్ మే 6
అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్ మే 12
సర్వేయర్స్ ఇన్ ఏపీ టౌన్ ప్లానింగ్ మే 12
టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ మే 13
కంప్యూటర్ డ్రాఫ్ట్మెన్స్ గ్రేడ్-2 మే 20
గ్రూప్-1 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ మే 27
No comments:
Post a Comment