Wednesday, July 18, 2012

సీట్ల కేటాయింపులో ర్యాంకులు, రిజర్వేషన్లు ఎలా పరిగణిస్తారు?


ఎంసెట్-మెడికల్ కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. వేలాదిమంది అభ్యర్థులు ఆ దిశగా
అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కౌన్సెలింగ్‌కు ఎలాంటి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి?
సీట్ల కేటాయింపులో ర్యాంకులు, రిజర్వేషన్లు ఎలా పరిగణిస్తారు?
గత ఏడాది ఏ రీజియన్ లో ఏ ర్యాంకు వరకు సీటు లభిస్తుంది? ఇలా ఎన్నో సందేహాలు..
ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు, కౌన్సెలింగ్ తీరుతెన్నులపై విశ్లేషణకు
ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఐ.వి.రావుతో
ప్రత్యేక ఇంటర్వ్యూ..

1. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ విధానంలో ఏమైనా మార్పులున్నాయా?
జవాబు: కౌన్సెలింగ్ విధానంలో కొత్త మార్పులేమీ లేవు. గతంలో మాదిరిగానే రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ల నుంచి ఆన్‌లైన్ విధానంలోనే కౌన్సెలింగ్ ఉంటుంది. అవి.. హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ కౌన్సెలింగ్ సెంటర్; విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ క్యాంపస్; విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యకేంద్రం బిల్డింగ్ ఎదురుగా; తిరుపతిలో ఎస్‌వీ యూనివర్సిటీ ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ ఎదురుగా. విద్యార్థులు ఈ నాలుగు కేంద్రాల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు.

2. సీట్లు, కళాశాలల సంఖ్య పెరుగుదలకు సంబంధించి ఈ ఏడాది కొత్త మార్పులు?
జవాబు: ప్రభుత్వ పరిధిలోని మొత్తం 14 కళాశాలల్లో మూడు కళాశాలలు.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ (విశాఖపట్నం), కర్నూలు మెడికల్ కళాశాల, స్టేట్‌వైడ్ కళాశాల సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 50 చొప్పున మొత్తం 150 సీట్లు పెరిగాయి. అదేవిధంగా ప్రైవేటు విభాగంలో మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆ్‌ఫ్ మెడికల్ సెన్సైస్ (ఘన్‌పూర్)లో 50 సీట్లు, మహారాజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(విజయనగరం)లో 50 సీట్లు పెరిగాయి. బీడీఎస్‌కు సంబంధించి సీట్లు, కళాశాలల విషయంలో ఎలాంటి మార్పులు లేవు.

3. కొత్త కళాశాలల వివరాలు?
జవాబు: ఈ ఏడాది రాష్ట్రానికి కొత్తగా మూడు ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు అనుమతి లభించింది. అవి ఓయూ రీజియన్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్, హైదరాబాద్ (100 సీట్లు); మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, హైదరాబాద్ (150 సీట్లు); ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఎన్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విశాఖపట్నం-150 సీట్లు). ఇలా.. ఇప్పటికే ఉన్న కళాశాలల్లో సీట్ల పెంపు, కొత్త కళాశాలల్లో సీట్లు ద్వారా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 650 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కడపలోని ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు, ఈ ఏడాది ఎంసీఐ అనుమతి నిరాకరించడంతో వంద సీట్లు తగ్గాయి.

4. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థి ఎలాంటి సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకుని హాజరు కావాలి?
జవాబు: నోటిఫికేషన్ ప్రకారం తమ ర్యాంకుకు సంబంధించిన తేదీల్లో తమకు అనుకూలమైన ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్‌లో ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.300, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 500 కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియెట్ మార్కుల లిస్ట్, ఎస్‌ఎస్‌సీ లేదా సమాన అర్హత పరీక్ష సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ పాస్, మార్కుల సర్టిఫికెట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ (ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్) తీసుకురావాలి.

ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు వరుసగా ఏడేళ్లు ఒకే ప్రాంతంలో చదవని విద్యార్థులు రెసిడెన్స్ సర్టిఫికెట్ తేవాలి. ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు తహసీల్దార్/ఎంఆర్‌ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్; ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు ఇన్‌కం సర్టిఫికెట్; రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఎంఆర్‌ఓ/తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్; ఆర్మీ/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ అండ్ గేమ్స్/ ఆంగ్లోఇండియన్ కోటాకు చెందిన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.

5. లోకల్, నాన్ లోకల్ విధానం అమలు తీరు ఎలా ఉంటుంది?
జవాబు: లోకల్ ఏరియా నిర్ణయించడానికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్(క్వాలిఫైయింగ్ ఎగ్జాం) వరకు విద్యార్థి చదివిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ఇంటర్మీడియెట్‌తో సహా అంతకు ముందు వరుసగా ఏడేళ్లు (ఆరు నుంచి ఇంటర్మీడియెట్) వరకు ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కళాశాలలకు లోకల్ అభ్యర్థిగా గుర్తింపు లభిస్తుంది. అలా కాకుండా ఇంటర్మీడియెట్‌లోపు వేర్వేరు యూనివర్సిటీ పరిధిల్లో సమానంగా చదివుంటే... ఇంటర్మీడియెట్ పూర్తి చేసే నాటికి ఏ వర్సిటీ పరిధిలో చదివితే ఆ వర్సిటీ లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు.

6. ఒక విద్యార్థి ఇంటర్మీడియెట్‌లోపు మూడు రీజియన్లు (ఏయూ, ఎస్వీయూ, ఓయూ)లోనూ చదివుంటే కౌన్సెలింగ్‌లో అతడిని ఏ రీజియన్‌కు లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు? (ఉదా: రమేశ్ అనే విద్యార్థి 4 నుంచి 7 వరకు ఏయూ పరిధిలో, 8 నుంచి 10 వరకు ఎస్వీయూ పరిధిలో, ఇంటర్మీడియెట్ ఓయూ పరిధిలో చదివితే అతడు కౌన్సెలింగ్‌లో ఏ ఏరియాకు లోకల్ అభ్యర్థి అవుతాడు).?

జవాబు: ఈ సందర్భంలో ఆ విద్యార్థి ఎస్‌వీ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాడు. అలాగే ఆరు నుంచి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం వరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో చదివితే అలాంటి విద్యార్థులు ఉస్మానియా రీజియన్‌కు లోకల్ అభ్యర్థులవుతారు.

7. కౌన్సెలింగ్‌లో ముందుగా అన్ రిజర్వ్‌డ్ (15 శాతం) సీట్లను భర్తీ చేస్తారా? లేదా లోకల్ కేటగిరీ భర్తీ అయ్యాక అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ భర్తీ చేస్తారా?
జవాబు: మొదట అన్‌రిజర్వ్‌డ్ 15 శాతం సీట్లు, తరువాత 85 శాతం లోకల్ సీట్లు భర్తీ చేస్తారు. మొదటగా భర్తీ చేసే 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కోటా సీట్ల కోసం.. విద్యార్థులు తమ రీజియన్‌తో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తంలోని కళాశాలల్లో సీట్ల కోసం పోటీ పడొచ్చు.

8. ఫీజు రీయింబర్‌‌సమెంట్ పొందే విద్యార్థులు తీసుకురావాల్సిన పత్రాలు? లేదా వారు కౌన్సెలింగ్ సమయంలో ఫీజు చెల్లించి తర్వాత రీయింబర్‌‌సమెంట్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలా?

జవాబు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాల ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు ఏ-కేటగిరీ, బీ-కేటగిరీ సీట్లకు; బీసీ అభ్యర్థులకు, కుటుంబ వార్షికాదాయం రూ. లక్ష లోపు ఉన్న ఈబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ కళాశాలల సీట్లు, ప్రైవేటు ఏ-కేటగిరీ సీట్లకు రీయింబర్స్‌మెంట్‌కు లభిస్తుంది. వీరు కౌన్సెలింగ్ సమయంలో కేవలం యూనివర్సిటీ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ట్యూషన్ ఫీజు చెల్లించక్కర్లేదు. ఈ సదుపాయం పొందాలంటే మాత్రం తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సిందే.

9. సీట్ల భర్తీ క్ర మంలో పరిగణించే అంశాలు వరుస క్రమంలో? వివరించగలరు. అంటే ‘ర్యాంకు, రీజియన్, రిజర్వేషన్, లోకల్- నాన్ లోకల్, ఓపెన్’ వీటిలో వేటిని వర ుస క్రమంలో పరిగణిస్తూ సీటు కేటాయింపు చేస్తారు.

జవాబు:రిజర్వేషన్, లోకల్ ఏరియా కేటగిరీలతో నిమిత్తం లేకుండా ముందుగా ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుందో? లేదో? చూస్తాం? తర్వాత యూనివర్సిటీ ఏరియా, రిజర్వేషన్, లోకల్, నాన్ లోకల్ వీటిని వరుసగా పరిగణనలోకి తీసుకుంటాం. మెరిట్ అభ్యర్థి నాన్‌లోకల్ ఏరియాలో ఎక్కడైనా సీటు పొందొచ్చు.

10. రెండో దశ కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు సీటు బదిలీ కోసం దీనికి హాజరయ్యే అవకాశం కల్పిస్తారా?
జవాబు: రెండో దశ కౌన్సెలింగ్ ఆగస్టులో జరుగుతుంది. మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులకు స్లైడింగ్ అవకాశం ఉంటుంది.

11. మౌలిక సదుపాయాల కొరత కారణంగా చూపుతూ ఎంసీఐ కొన్ని కళాశాలల్లో సీట్ల పెంపుదలకు నిరాకరించింది. వాటిలో ప్రభుత్వ కళాశాలలు కూడా ఉన్నాయి. దీనిపై మీ స్పందన?
జవాబు: సీట్లు పెంచడం, తగ్గించడం అంతా ఎంసీఐ స్వీయ నిర్ణయాధికారం. ఎంసీఐ బృందం తాము నిర్వహించే తనిఖీల్లో తేలిన అంశాల ఆధారంగా సీట్లను పెంచడం, తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంటుంది. సీట్లు పెంపుదల దిశగా మా వంతుగా కృషి చేస్తున్నాం.
ప్రతి కళాశాలపై యూనివర్సిటీ నిరంతర నిఘా, పర్యవేక్షణ ఉంటుంది. లోపాలు బయటపడితే దానికి సంబంధించిన క్రమశిక్షణ చర్యల తీసుకోవాలని ప్రభుత్వానికి, ఎంసీఐకి సిఫార్సు చేస్తాం.

12. ఈ ఏడాది కొత్తగా.. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్‌లైన్‌లోనే చేపట్టాలనే ఆలోచన ఈ కౌన్సెలింగ్‌లోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందా?
జవాబు: ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

13. ఎంబీబీఎస్, బీడీఎస్ కాకుండా ఇతర మెడికల్ కోర్సుల(హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేద , యునానీ) కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది?
జవాబు: హోమియో, నేచురోపతి, ఆయుర్వేద డిగ్రీ కోర్సులకు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఆగస్టులోనే కౌన్సెలింగ్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం.

14. చివరగా.. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు; సీటు పొంది కోర్సులో చేరాక మెరుగ్గా రాణించేందుకు మీరిచ్చే సలహాలు?

జవాబు: కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు నిర్దేశిత ధ్రువపత్రాలన్నీ తప్పనిసరిగా తీసుకురావాలి. ఒక్కటి లేకున్నా కౌన్సెలింగ్‌లో అనర్హతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక.. సీటు పొందిన విద్యార్థులు.. ఎంబీబీఎస్ కోర్సు చాలా కఠినమైన కోర్సని గుర్తించాలి. ఎంసెట్ కోసం పడిన శ్రమకు ప్రతిఫలం లభించిందని సరిపెట్టుకోకుండా.. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా గుర్తింపు పొందడం లక్ష్యంగా చేసుకోవాలి.

దీనికోసం కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచే నిరంతర పరిశ్రమ చేసి సబ్జెక్టులను బాగా అధ్యయనం చేసి, క్లినికల్ స్కిల్స్ పూర్తిగా నేర్చుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం బాగా కృషి చేయాలి. రోగులతో సహృదయంతో వ్యవహరించి... నైపుణ్యత ఉన్న డాక్టర్‌గా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

15. కోర్సు పూర్తయ్యాక రూరల్ సర్వీస్ తప్పనిసరా?
జవాబు: జీవో 166 ప్రకారం.. కోర్సు పూర్తయ్యాక ఏడాదిపాటు రూరల్ సర్వీస్ తప్పనిసరి. ఈ జీవో గత రెండేళ్ల నుంచి అమల్లో ఉంది.


మేనేజ్‌మెంట్ కోటా మార్గదర్శకాలు:

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలు 40 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ (ప్రైవేట్-సి) కోటా కింద భర్తీ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 30, 2007న ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం 136 ప్రకారం ప్రతి కళాశాల మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి పత్రికా ప్రకటన జారీ చేయాలి.

నిర్దేశిత విద్యార్హతలు ఉండి, ఆసక్తి ఉన్న వారికి తప్పనిసరిగా దరఖాస్తులు అందజేయాలి. దరఖాస్తులు సమర్పించిన ప్రతి ఒక్కరికీ రశీదు ఇవ్వాలి. ప్రవేశ ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించాలి.

వార్షిక ట్యూషన్ ఫీజు రూ. 5.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ కళాశాలల మేనేజ్‌మెంట్‌లు అంతకుమించి ఒక్కపైసా కూడా అదనంగా వసూలు చేయకూడదు. ఇలా చేస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే.

అంతేకాకుండా ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ఒకేసారి వసూలు చేయకూడదు. ప్రతి ఏటా ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజును మాత్రమే వసూలు చేయాలి.

జీఓ 136ను ఉల్లంఘించినట్లు ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే సంబంధిత కళాశాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

No comments:

Post a Comment