Tuesday, May 8, 2012

డైట్‌సెట్‌లో మంచి ర్యాంకు సాధించండిలా...


ఇంటర్‌తోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించే కోర్సు... డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఈడీ). ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి డీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులని.. వారితోనే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో ఈ కోర్సు చేసినవారి భవిష్యత్ బంగారం కానుంది. డీఈడీలో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డైట్‌సెట్ రాయాలి. ఈ నేపథ్యంలో డైట్‌సెట్-2012కు ప్రిపరేషన్ వ్యూహాలు..

అర్హత : 45 శాతం (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చేసినవారు డైట్‌సెట్‌కు అర్హులు కాదు. వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2012 నాటికి కనీసం 17 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

సీట్ల వివరాలు:
రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 23 ప్రభుత్వ డైట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో తెలుగు మీడియానికి సంబంధించి ప్రతి కళాశాలకు 100 సీట్లు ఉన్నాయి. అంటే.. మొత్తం 2300 సీట్లు. ఇక ప్రైవే ట్ డైట్ కళాశాలలు దాదాపు 201. వీటిల్లో ప్రతి కళాశాలలో దాదాపు 50 సీట్లు చొప్పున 10,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశపరీక్ష: ఆబెక్టివ్ విధానంలో రెండు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు(వంద మార్కులు). ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి స్టేట్ సిలబస్ స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది.

ఉన్నత విద్య: డీఈడీతో ఎస్‌జీటీ ఉద్యోగం పొందిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉన్నత కోర్సులు చదవడం ద్వారా కెరీర్‌ను మరింత ఉన్నతంగా చక్కదిద్దుకోవచ్చు. ఎస్‌జీటీగా రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసిన అభ్యర్థులు డిగ్రీ అర్హత ఉంటే దూరవిద్య విధానంలో బీఈడీ చేయొచ్చు. బీఈడీతో స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌కు అర్హత లభిస్తుంది. ఆ తర్వాత పీజీ కూడా పూర్తిచేస్తే జూనియర్ లెక్చరర్ స్థాయికి చేరుకోవచ్చు. దూరవిద్య విధానంలో ఎంఈడీ, ఎంఏ (ఎడ్యుకేషన్) వంటి ఉన్నత కోర్సులు పూర్తిచేయొచ్చు.

ఈ కోర్సులను దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు దూరవిద్య విధానంలో ఆఫర్ చేస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు.. సంతృప్తికరంగా జీతభత్యాలు పొందేందుకు ఉపాధ్యాయ వృత్తి కేరాఫ్‌గా నిలిచింది. పరిమిత పని గంటలు, విధి నిర్వహణ అధ్యయనంతో ముడిపడి ఉండటం మరే ఉద్యోగం విషయంలోనూ సాధ్యం కాదు. అందువల్లే గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి టీచర్ ఉద్యోగం బాగా ఉపకరిస్తోంది.

డీఈడీతో కెరీర్: డీఈడీ పూర్తిచేసినవారికి అద్భుత అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోనూ 70 శాతం పోస్టులను సెకండరీగ్రేడ్ టీచర్లకు పదోన్నతిపై కల్పించనున్నారు. నర్సరీలు, కాన్వెంట్లలలో బోధించాలంటే డీఈడీ అభ్యర్థులు తప్పనిసరి. ప్రస్తుత డీఎస్సీలో మొత్తం 11 వేలకుపైగా ఎస్‌జీటీ పోస్టులున్నాయి. కానీ డీఈడీ ఉత్తీర్ణులు రాష్ట్రంలో 60 వేలకు మించిలేరు.

దీంతో ఒక్కో పోస్టుకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య 1:5గా ఉంది. ఈ నేపథ్యంలో కొంచెం కష్టపడ్డా సులువుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలం. బీఈడీ చేసిన ఉపాధ్యాయులు, సీనియారిటీ ప్రాతిపదికపై మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ), డిప్యూటీ డీఈఓ స్థాయి వరకూ పదోన్నతులు పొందొచ్చు.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: ఏపీ ఆన్‌లైన్/ఈసేవా కేంద్రాల్లో * 200 ఫీజు చెల్లించాలి.

ముఖ్య తేదీలు:
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 9, 2012
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2012
పరీక్ష తేదీ: జూలై 8, 2012; 10.30 నుంచి 12.30 వరకు
వెబ్‌సైట్: http://dietcet.cgg.gov.in

No comments:

Post a Comment