దేశ, విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనేది ప్రతి విద్యార్థి కల. కానీ చాలా మంది విద్యార్థులకు ఆర్థిక లేమి. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్నో వర్సిటీలు/సంస్థలు మేమున్నామంటూ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నాయి. వాటి వివరాలు..
యూజీసీ పీజీ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ/ఎస్టీ
ప్రొఫెషనల్ పీజీ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూజీసీ అందించే స్కాలర్షిప్లకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిని 2012-13 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఫార్మసీ మొదలైన కోర్సులను రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారికి అందిస్తారు.
మొత్తం స్కాలర్షిప్స్: 1000
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ప్రస్తుత విద్యా సంవత్సరానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/ కళాశాలల్లో పీజీ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతుండాలి. దూరవిద్య ద్వారా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ను ఇవ్వరు.
వయో పరిమితి: పురుషులకు జూలై 1, 2012 నాటికి 45 ఏళ్లు మించరాదు. మహిళలకు గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లు.
స్కాలర్షిప్ వ్యవధి: కోర్సును బట్టి రెండు/మూడేళ్లు
స్కాలర్షిప్ మొత్తం: ఎంఈ/ఎంటెక్ కోర్సులు చదువుతున్న వారికి నెలకు రూ. 5000, ఇతర పీజీ కోర్సులు చదువుతున్న వారికి నెలకు రూ.3000 స్కాలర్షిప్తోపాటు కాంటిన్జెన్సీ గ్రాంట్ కింద ఎంఈ/ఎంటెక్ విద్యార్థులకు ఏడాదికి రూ.15000, ఇతరులకు ఏడాదికి రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 6, 2012
వెబ్సైట్: www.ugc.ac.in/pgsprof/
మన్మోహన్సింగ్ స్కాలర్షిప్స్-2013
ఇంగ్లండ్లోని సెయింట్ జాన్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, సోషల్ సెన్సైస్లో డాక్టోరల్ కోర్సులు చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే మన్మోహన్సింగ్ స్కాలర్షిప్స్కు నోటిఫికేషన్ విడుదలైంది. సెయింట్ జాన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్ధం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ స్కాలర్షిప్ను అందిస్తోంది.
అర్హతలు:
- భారతీయ పౌరులై ఉండి పాస్పోర్ట్ను కలిగి ఉండాలి.
- డిసెంబర్ 31, 2012 నాటికి 35 ఏళ్లు మించరాదు.
- ఇంగ్లిష్లో రాయగలిగి, మాట్లాడగలిగి ఉండాలి.
- ఇప్పటివరకు యూకే ప్రభుత్వం అందించే ఎలాంటి స్కాలర్షిప్/ఆర్థిక సహాయాన్ని పొంది ఉండకూడదు.
- గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత సబ్జెక్టులలో యూజీ, పీజీలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- లీడర్షిప్ క్వాలిటీస్ (ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదా సంబంధిత సబ్జెక్టులలో విద్యార్థి తాను చేసిన కృషి.. దానికి సంబంధించి ఏదైనా పబ్లికేషన్స్లో ప్రచురితమైతే వాటి వివరాలు) తెలిపేలా ఆధార పత్రం.
- సెప్టెంబర్/అక్టోబర్ 2013 నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ-యూకేలో ప్రారంభమయ్యే డాక్టోరల్ కోర్సులు చదవడానికి ఆసక్తి కలిగి ఉండాలి.
స్కాలర్షిప్ ద్వారా అందేవి: అకడెమిక్ ఫీజులు, రానూపోను విమాన ఖర్చులు, యూకేలో నివసించడానికి నెలవారీ ఖర్చులు, యూకే వీసా.
ఎంపిక విధానం: విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా బ్రిటిష్ కౌన్సిల్ షార్ట్లిస్ట్ చేస్తుంది. వీరికి న్యూఢిల్లీలో నిపుణుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి స్కాలర్షిప్కు ఎంపిక చేస్తుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:డిసెంబర్ 31, 2012
వెబ్సైట్: www.britishcouncil.org
ఖొరానా ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్స్
అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీతోపాటు దానితో భాగస్వామ్యమున్న ఇతర అమెరికన్ వర్సిటీల్లో బయోటెక్నాలజీ.. సంబంధిత అంశాల్లో రీసెర్చ్ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే ఖొరానా స్కాలర్షిప్కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ స్కాలర్షిప్ను 2013 సంవత్సరానికి గానూ విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ (యూఎస్), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ, ఇండియా), ఇండియా-యూఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం కలిసి అందిస్తున్నాయి.
కోర్సును అందిస్తోన్న అమెరికన్ యూనివర్సిటీలు:
- యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్
- యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్
- యూనివర్సిటీ ఆఫ్ లోవా
- యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్
- మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ
- యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా
- ఇండియానా యూనివర్సిటీ
- జార్జిటౌన్ యూనివర్సిటీ-బ్లూమింగ్టన్
- మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)
అర్హత:
- ఇండియాలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాలల్లో బయోటెక్నాలజీ.. దాని సంబంధిత (అగ్రికల్చర్, హెల్త్, బయోమెడికల్ సెన్సైస్) అంశాల్లో బీటెక్/ఎంటెక్/ఎమ్మెస్సీ చదువుతుండాలి.
- యూఎస్లోని సంబంధిత యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ సంబంధిత అంశాల్లో రీసెర్చ్ చేసేందుకు ఆసక్తి ఉండాలి.
స్కాలర్షిప్ వ్యవధి: 10 వారాలు (మే-జూలై 2013)
స్కాలర్షిప్ ద్వారా: ఎయిర్ఫేర్, స్టైఫండ్, ఉచిత వసతి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి scholar@indousstf.org కు మెయిల్ చేయాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
వెబ్సైట్: http://indousstf.org
యూజీసీ-ఫీనిష్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్
2013-14 విద్యా సంవత్సరానికి ఫిన్లాండ్లో రీసెర్చ్ కోర్సులు, డాక్టోరల్ స్టడీస్ చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫిన్లాండ్ ప్రభుత్వం స్కాలర్షిప్పులను అందిస్తోంది.
మొత్తం స్కాలర్షిప్స్: 10
అర్హతలు:
- భారతీయ పౌరులై ఉండాలి.
- మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునేముందు ఫిన్లాండ్ అకడెమిక్ సూపర్వైజర్ నుంచి ఆహ్వానం అందుకుని ఉండాలి.
- ఇంగ్లిష్/స్వీడిష్/ఫీనిష్ లాంగ్వేజీల్లో దేనిలోనైనా రైటింగ్, స్పీకింగ్ సామర్థ్యం అవసరం.
స్కాలర్షిప్ మొత్తం: నెలకు 1200 యూరోల చొప్పున ఏడాదిపాటు చెల్లిస్తారు. స్కాలర్షిప్కు ఎంపికైన అభ్యర్థులకు రానుపోను ఎయిర్ఫేర్ ఛార్జీలను యూజీసీ చెల్లిస్తుంది.
దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు స్టడీ రీసెర్చ్ ప్లాన్, సీవీ, రెండు రికమండేషన్ లెటర్స్, విద్యార్హతలను తెలిపే సర్టిఫికెట్ల కాపీలను ఈ దిగువ చిరునామాకు పంపాలి.
పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
సెక్షన్ ఆఫీసర్ (ఐసీ), రూమ్ నెంబర్-508 ఏ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, బహదూర్షా జాఫర్ మార్గ్, న్యూఢిల్లీ-110002
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
వెబ్సైట్స్: www.ugc.ac.in, www.studyinfinland.fi
రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్
విదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో రీసెర్చ్ చేస్తున్న భారతీయులకు అందించే రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్నకు నోటిఫికేషన్ వెలువడింది. దీన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) అందిస్తోంది. విదేశాల్లో బయోటెక్నాలజీ సంబంధిత అంశాల్లో (అగ్రికల్చర్, హెల్త్ సెన్సైస్, బయో ఇంజనీరింగ్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, బయో ఇన్ఫర్మేటిక్స్ మొదలైనవి) రీసెర్చ్ చేస్తున్నవారికి ఈ ఫెలోషిప్లు అందిస్తారు.
అర్హత: పీహెచ్డీ/ఎండీ/ఎంటెక్/ఎంవీఎస్సీలలో మంచి అకడెమిక్ రికార్డుతో ఉత్తీర్ణత సాధించడంతోపాటు విదేశాల్లో ఆర్ అండ్ డీ సంస్థల్లో మూడేళ్ల పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అనుభవం తప్పనిసరి. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చి మన దేశంలో ఇక్కడే పని చేస్తున్న భారతీయులకు ఈ ఫెలోషిప్ అందించరు.
వయో పరిమితి: నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి 55ఏళ్లు మించరాదు.
ఫెలోషిప్ వ్యవధి: ఐదేళ్లు
ఫెలోషిప్: ఫెలోషిప్నకు ఎంపికైనవారిని ఫ్యాకల్టీగా, వివిధ ఆర్ అండ్ డీ ఇన్స్టిట్యూషన్స్ల్లో సైంటిస్ట్-డీ విభాగంలో శాస్త్రవేత్తగా నియమిస్తారు. రెమ్యునరేషన్గా నెలకు రూ.75,000 అందించడంతోపాటు ఇంటి అద్దె అలవెన్స్ కింద నెలకు రూ.7500 చెల్లిస్తారు. అంతేకాకుండా కాంటిన్జెన్సీ గ్రాంట్ కింద మొదటి ఏడాది రూ.10 లక్షలు, రెండో ఏడాది రూ.7.5 లక్షలు, మూడో ఏడాది రూ.5 లక్షలు అందిస్తారు. వీటిని ఎక్విప్మెంట్ కొనుగోలుకు, సెమినార్లకు హాజరు కావడానికి, రీసెర్చ్కు అవసరమైన మానవ వనరులను ఏర్పాటు చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. వీటితోపాటు వైద్య సౌకర్యం, రవాణా భత్యం, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మొదలైన సదుపాయాలు అందిస్తారు.
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో ఉన్న దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి ఈ దిగువ చిరునామాకు పంపాలి.
డాక్టర్ మీనాక్షి మున్షీ, డెరైక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ,
బ్లాక్-2, 7వ ఫ్లోర్, సీజీఎం కాంప్లెక్స్, లోఢీ రోడ్, న్యూఢిల్లీ-110003
ఈ-మెయిల్: rlsfellowship.dbt@nic.in
పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: డిసెంబర్ 31, 2012
వెబ్సైట్: www.dbtindia.nic.in
ఎన్బీహెచ్ఎం స్కాలర్షిప్స్
2013-14 విద్యా సంవత్సరానికి మ్యాథమెటిక్స్లో పీహెచ్డీ చదవాలనుకునే విద్యార్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్ (ఎన్బీహెచ్ఎం) స్కాలర్షిప్పులను అందిస్తోంది.
అర్హత:
- మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఏ/బీఎస్సీ/బీటెక్/బీఈ/ఎంఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత లేదా సంబంధిత కోర్సులు ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే.
- 10+2 నుంచి డిగ్రీ/పీజీ వరకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ద్వితీయ శ్రేణితో బీఎస్సీ(ఆనర్స్)ఉత్తీర్ణులు అర్హులే.
- పీహెచ్డీ (మ్యాథ్స్) కోసం ఏదైనా ఇన్స్టిట్యూట్లో దరఖాస్తు చేసుకుని ఉండాలి.
స్కాలర్షిప్: మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000, ఆ తర్వాత సంవత్సరాల్లో నెలకు రూ.18000లతోపాటు ఏడాదికి రూ.20,000 కాంటిన్జెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. వీటితోపాటు ఇంటి అద్దె అలవెన్స్ కూడా అందిస్తారు.
స్కాలర్షిప్ వ్యవధి: నాలుగేళ్లు. విద్యార్థి ప్రతిభను బట్టి మరో ఏడాది పొడిగిస్తారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్-చెన్నై, హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-అలహాబాద్, ఐఐఎస్ఈఆర్ (పుణె) వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పీహెచ్డీ మ్యాథ్స్ చదవడానికి ఈ పరీక్ష తప్పనిసరి.
ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇందులో విజయం సాధించినవారిని స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: రెండున్నర గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మ్యాథ్స్పై పీజీ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పాత ప్రశ్నపత్రాల కోసం www.nbhm.dae.gov.in చూడొచ్చు.
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా ఆధారంగా పూర్తిచేసిన దరఖాస్తును ఈ కింద చిరునామాకు పంపాలి.
ప్రొఫెసర్ ఈ.కేశవన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్, సీఐటీ క్యాంపస్, తారామణి, చెన్నై-600113. ఈ-మెయిల్: kesh@imsc.res.in
ముఖ్య తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
రాత పరీక్ష: జనవరి 19, 2013
వెబ్సైట్: www.nbhm.dae.gov.in
No comments:
Post a Comment